సుమారు నాలుగు నెలల పాటు అమెరికా-ఇరాన్ యుద్ధం కొనసాగిన తర్వాత ఇటీవలే రెండు దేశాలు శాంతి ఒప్పందంపై సంతకాలు చేశాయి. యుద్ధం ముగిసిందని అందరూ సంతోషిస్తుండగానే హోర్ముజ్ జలసంధిలో ఓ వాణిజ్య నౌకపై ఇరాన్ దాడి చేయడంతో పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్ శాంతి ఒప్పందం ఉల్లంఘించినందుకు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. ఆ తర్వాత కొన్ని గంటల వ్యవధిలోనే అమెరికా యుద్ధ విమానాలు ఇరాన్లోని పలు సైనిక స్థావరాలపై వైమానిక దాడులు నిర్వహించింది.
అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఇరాన్కు చెందిన క్షిపణి నిల్వ కేంద్రాలు, డ్రోన్ గిడ్డంగులు, తీర ప్రాంత రాడార్ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేపట్టారు. అంతర్జాతీయ సముద్ర రవాణాకు ముప్పుగా మారిన ఇరాన్కు బుద్ధి చెప్పడానికే ఈ దాడులు చేశామని అమెరికా పేర్కొంది.
అయితే అమెరికా చర్యలను ఇరాన్ తీవ్రంగా ఖండించింది. తమ సార్వభౌమాధికారంపై దాడి జరిగిందని ఆరోపిస్తూ, ఈ దాడులకు తగిన రీతిలో ప్రతిస్పందిస్తామని హెచ్చరించింది.
ప్రపంచ చమురు రవాణాకు చాలా కీలకమైన హోర్ముజ్ జలసంధిలో ఈ తాజా పరిణామాలు మళ్ళీ ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఒకవేళ ఈ పరస్పర దాడులు కొనసాగి మళ్ళీ ఉద్రిక్తతలు పెరిగితే చమురు, గ్యాస్ ధరలుపెరిగే అవకాశం ఉంటుంది.