తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను హైరిస్క్ రాష్ట్రాలుగా వర్గీకరిస్తూ ఏపీ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల కలక్టర్ల సూచనలు, సలహాల మేరకు క్వారెంటైన్ నిబందనలలో కూడా పలు మార్పులు చేర్పులు చేసింది.
ఏపీలో క్వారెంటైన్ కొత్త మార్గదర్శకాలు:
1. ఏపీకి రావాలనుకొనేవారు ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్పందన యాప్ ద్వారా ఈ-పాస్ కోసం విధిగా దరఖాస్తు చేసుకోవాలి.
2. ఇక నుంచి తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చేవారికి 14 రోజులు హోం క్వారెంటైన్ తప్పనిసరి.
3. తెలంగాణ, కర్ణాటకల నుంచి రోడ్డు మార్గం ద్వారా వచ్చే వారికి ఏపీ సరిహద్దు చెక్ పోస్టుల వద్దే స్వాబ్ టెస్టులు నిర్వహించాలి. వారికి కరోనా లక్షణాలు కనిపించినట్లయితే నేరుగా కరోనా ఆసుపత్రులకే తరలించాలి.
4. ఇతర రాష్ట్రాల నుంచి విమానాల ద్వారా వచ్చే వారికి విమానాశ్రయాలలోనే స్వాబ్ టెస్టులు చేయాలి. వారికి 14 రోజులు హోం క్వారెంటైన్ తప్పనిసరి.
5. ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ళ ద్వారా వచ్చే వారికి రైల్వేస్టేషన్లలోనే ర్యాండమ్గా టెస్టులు చేయాలి. వారికి 14 రోజులు హోం క్వారెంటైన్ తప్పనిసరి.
6. హోం క్వారెంటైన్లో ఉన్నవారి కదలికలపై ఏఎన్ఎంలు, గ్రామవాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులు నిఘా పెట్టాలి.
7. గల్ఫ్ దేశాలతో సహా విదేశాల నుంచి వచ్చినవారికి హోం క్వారెంటైన్ గడువు 14 నుంచి 7 రోజులకు కుదింపు.
8. విదేశాల నుంచి వచ్చిన వారికి మొదటిరోజు, 5వ, 7వ రోజులలో తప్పనిసరిగా కరోనా పరీక్షలు జరపాలి.