జనవరి 3 నుంచి 20వ తేదీ వరకు ఉపాధ్యాయ అర్హత (టెట్) పరీక్షలు జరుగబోతున్నాయి. కనుక తెలంగాణ విద్యాశాఖ నేడు హాల్ టికెట్స్ విడుదల చేసింది. హాల్ టికెట్స్ విద్యాశాఖ అధికారిక వెబ్సైట్ https://tgtet.aptonline.in/tgtet/HallticketFront నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రతీరోజు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు మళ్ళీ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు ఈ పరీక్షలు జరుగుతాయి. ఫిబ్రవరి 10-16 తేదీలలో ఫలితాలు వెలువడతాయి.
సుప్రీంకోర్టు తాజా ఆదేశం ప్రకారం ఉపాధ్యాయ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలంటే ఇప్పుడు టెట్ పరీక్షలలో అర్హత సాధించాల్సి ఉంటుంది. సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు కూడా టెట్ అర్హత తప్పనిసరి చేయడంతో వారు కూడా ఈ పరీక్షలకు హాజరవుతున్నారు. కనుక ఈసారి టెట్ పరీక్షలు వ్రాసే అభ్యర్ధుల సంఖ్య గణనీయంగా పెరిగింది.
పేపర్-1,2 లకు కలిపి మొత్తం 2.37 లక్షల మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 70 వేలమంది కేజీబీవీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ టీచర్లు కూడా ఉన్నారు.