గ్రూప్-1 కేసుపై హైకోర్టులో విచారణ, వాదోపవాదాలు ముగిశాయి. నేడో రేపో తీర్పు వెలువడుతుందని ఆర్హత సాధించిన అభ్యర్ధులు అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. కానీ తుది తీర్పు కాపీ ఇంకా సిద్ధం కానందున ఈ కేసు తదుపరి విచారణ ఫిభ్రవరి 5కి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
గ్రూప్-1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనం, ఫలితాలలో అనేక అవకతవకలు జరిగాయంటూ కొందరు అభ్యర్ధులు హైకోర్టు సింగిల్ జడ్జ్ కోర్టులో పిటిషన్ వేయగా, న్యాయమూర్తి స్టే విధించారు.
మార్కుల తుది జాబితా, జనరల్ ర్యాంకులు రద్దు చేసి జవాబు పత్రాలను మళ్ళీ మూల్యాంకనం చేయాలని ఆదేశించారు. ఒకవేళ సాధ్యం కాకుంటే మళ్ళీ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు.
సింగిల్ జడ్జ్ ఇచ్చిన ఈ ఉత్తర్వులని అర్హత సాధించిన కొందరు అభ్యర్ధులు, టిజీపీఎస్సీ హైకోర్టు డివిజన్ బెంచ్లో సవాలు చేశారు. దానిపై విచారణ జరిపిన డివిజన్ బెంచ్ స్టే ఎత్తివేసింది. గ్రూప్-1 పరీక్షలలో అర్హత సాధించినవారికి నియామక పత్రాలు ఇచ్చేందుకు ప్రభుత్వాన్ని అనుమతించింది.
కానీ ఆ నియామకాలు తుది తీర్పుకి లోబడి ఉండాలని ముందే స్పష్టం చేసింది. కనుక ఆ తుది తీర్పు ఏవిధంగా ఉండబోతోందని అందరూ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఫిభ్రవరి 5న తుది తీర్పు ప్రకటించే అవకాశం ఉంది.