తెలంగాణ ఇంటర్మీడియెట్ ప్రధమ, ద్వితీయ పరీక్షా ఫలితాలు నేడు వెలువడ్డాయి. ఈసారి కూడా బాలురకంటే బాలికల ఉత్తీర్ణ శాతం ఎక్కువగా ఉంది.
మొదటి సంవత్సరం పరీక్షలకు మొత్తం 4,88,430 మంది విద్యార్ధులు హాజరు కాగా వారిలో 3,22,191 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 66.89 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్న మాట!
రెండో సంవత్సరం పరీక్షలకు మొత్తం 5,08,582 మంది విద్యార్ధులు హాజరు కాగా వారిలో 3,30,908 మంది ఉత్తీర్ణులయ్యారు. అంటే 71.37 శాతం మంది ఉత్తీర్ణులయ్యారన్న మాట!
మొదటి సంవత్సరం పరీక్షలలో బాలికలు 74.21 శాతం మంది ఉత్తీర్ణులు కాగా, బాలురు 57.31 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
రెండో సంవత్సరం పరీక్షలలో బాలికలు 73.83 శాతం మంది ఉత్తీర్ణులుకాగా బాలురు 57.83 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
జిల్లాల వారీగా ఫలితాలలో ఇంటర్ ప్రధమ పరీక్ష ఫలితాలలో మేడ్చల్ జిల్లా విద్యార్ధులు అత్యధికంగా 81.06 శాతం ఉత్తీర్ణత సాధించగా, ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షా ఫలితాలలో ములుగు జిల్లా విద్యార్ధులు 77.21 శాతం ఉత్తీర్ణత సాధించారు.
నేటి నుంచి వారం రోజుల పాటు మార్కులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం నిర్దిష్ట ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు. వచ్చే నెల 22 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది.