దేశవ్యాప్తంగా ఏటిఎం సేవలు అందుబాటులోకి వచ్చినప్పటి నగదు లావాదేవీల కోసం ప్రజలు బ్యాంకులకు వెళ్ళడం బాగా తగ్గింది. ప్రయాణీకుల సౌకర్యార్ధం రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాలలో కూడా ఏటిఎం సేవలు అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు నడుస్తున్న రైళ్ళలో కూడా ఏటిఎం సేవలు అందుబాటులోకి వస్తున్నాయి.
ప్రయోగాత్మకంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర పంచవటి ఎక్స్ప్రెస్లో ఏటిఎం సేవలు ప్రారంభించింది. ఈ ఎక్స్ప్రెస్ రైలు ముంబై ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుంచి మన్మాడ్కు రాకపోకలు సాగిస్తుంటుంది.
ఏటిఎంలు ఇంటర్నెట్ కనెక్షన్తోనే పనిచేస్తుంటాయనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వందే భారత్ వంటి పలు ఎక్స్ప్రెస్ రైళ్ళలో ప్రయాణీకుల సౌకర్యార్ధం వైఫీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. కనుక ఏటిఎం సేవలు కూడా అందించవచ్చని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఆలోచనతో చేసిన ఈ ప్రయోగం విజయవంతం అయినట్లు తెలుస్తోంది.
కనుక రాబోయే రోజుల్లో అన్ని ప్రధాన రైళ్ళలో ఏటిఎంలు కనిపించినా ఆశ్చర్యం లేదు. అయితే ఓకే రైలులో వివిద బ్యాంకుల ఏటిఎంలు ఏర్పాటు చేయడం కష్టం కనుక అన్ని బ్యాంకులకు కలిపి సేవలు అందించేలా కామన్ ఏటిఎంలు ఏర్పాటు చేస్తారేమో?