మాస్ మహరాజ్ రవితేజ హీరోగా వచ్చిన యాక్షన్ మూవీ ఈగల్ ఈ నెల 9న థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సంపాదించుకొని మంచి కలెక్షన్స్ రాబడుతోంది. నెలరోజులు కాకముందే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తోంది. అదీ ఒకేసారి రెండు వేర్వేరు ఓటీటీలలోకి!
రేపు అంటే మార్చి 1నుంచి ఈగల్ సినిమా అమెజాన్ ప్రైమ్, ఈటీవీ విన్ ఓటీటీలలో ప్రసారం కాబోతోంది. కార్తీక్ ఘట్టమనేని కధ, దర్శకత్వంలో వచ్చిన ఈగల్ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, కావ్యా థాపర్, నవదీప్, వినయ్ రాయ్, మధు, అవసరాల శ్రీనివాస్, శ్రీనివాస్ రెడ్డి, అజయ్ ఘోష్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై నిర్మించిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే: మణిబాబు కరణం, సినిమాటోగ్రాఫర్: కమ్లీ ప్లాకీ, కరమ్ చావ్లా, సంగీతం: దేవ్ జాండ్, ఫైట్స్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్, టోమెక్ చేశారు.
క్లుప్తంగా కధ ఏమిటంటే... చిత్తూరు జిల్లా తలకోన అడవుల్లో ఓ పత్తిమిల్లు నుంచి సహదేవ్ వర్మ (రవితేజ) అంతర్జాతీయ స్థాయిలో ఈగల్ నెట్వర్క్ నడిపిస్తున్నాడనే జర్నలిస్ట్ నళిని (అనుపమ పరమేశ్వరన్) ఓ పత్రికలో వ్రాసిన చిన్న కధనంతో ఈ కధ మొదలయ్యి, పోలండ్ దేశం వరకు విస్తరిస్తుంది.