ప్రముఖ ఐటి కంపెనీ ‘కాగ్నిజెంట్’ 2025 సం.కి తన ఉద్యోగులకు 100 శాతం బోనస్ ప్రకటించడం విశేషం. ఈ సంస్థ సీఈవో రవి కుమార్ తమ ఉద్యోగులకు ఈ మెయిల్స్ ద్వారా ఈ విషయం తెలియజేశారు. మరో రెండేళ్ళలో సాధించాలనుకున్న లక్ష్యాలను ఇప్పుడే సాధించినందుకు ఉద్యోగులందరికీ 100 శాతం బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.
కంపెనీలో ఉద్యోగులు అందరూ అత్యంత క్రమశిక్షణతో, అత్యద్భుతంగా కలిసికట్టుగా పని చేసి ఈ లక్ష్యాన్ని సాధించారంటూ సీఈవో రవి కుమార్ తమ ఉద్యోగులను అభినందించారు. ప్రపంచంలో అత్యుత్తమ పనితీరు, అభివృద్ధి సాధించిన కంపెనీలు ‘విన్నర్స్ సర్కిల్’ జాబితాలో ఉంటాయి. ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా ఆ విన్నర్స్ సర్కిల్లో చేరింది.
గత ఏడాది జనవరి నుంచి డిసెంబర్ మద్య కాలంలో కాగ్నిజెంట్ ఆదాయం 7 శాతం అంటే సుమారు రూ.1.90 లక్షల కోట్లకు చేరింది. ఇది ఆ కంపెనీ చరిత్రలో తొలి రికార్డ్. అందుకే ఉద్యోగులకు100 శాతం బోనస్ ఇస్తోంది.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చిత్ర విచిత్రమైన నిర్ణయాలతో భారత్తో సహా యావత్ ప్రపంచదేశాల ఆర్ధిక వ్యవస్థలు, ఐటి కంపెనీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనవుతున్నాయి. ఈ కారణంగా పలు కంపెనీలు వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
కానీ తొలిసారిగా కాగ్నిజెంట్ అభివృద్ధి పదంలో సాగుటూ భారీగా లాభాలు ఆర్జించడం, ఉద్యోగులకు 100 శాతం బోనస్ ప్రకటించడం రాబోయే రోజుల్లో చాలా శుభ పరిణామమే. కాగ్నిజెంట్ మొదటి అడుగు వేసింది కనుక అన్ని ఐటి కంపెనీలు ఇకపై ఇదేవిధంగా అభివృద్ధిపదంలో దూసుకుపోతాయని ఆశిద్దాం.