కొరటాల శివ-మహేష్ బాబు కాంబినేషన్లో 2015లో వచ్చిన ‘శ్రీమంతుడు’ కాపీరైట్ వివాదం ఇంకా తేలనేలేదు. ఇప్పుడు సాయిరాజేష్ నీలం-ఆనంద్ దేవరకొండ కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ‘బేబీ’పై కూడా ఈ వివాదం మొదలైంది. షార్ట్ ఫిలిమ్స్ దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ శిరీన్ శ్రీరామ్ శుక్రవారం రాయదుర్గం పోలీస్ స్టేషన్లో బేబీ దర్శకుడు సాయి రాజేష్ నీలం, నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడులపై ఫిర్యాదు చేశారు.
2013లో తన సినిమాకు సినిమాటోగ్రాఫర్గా పనిచేయాలని దర్శకుడు సాయి రాజేష్ అడిగారని చెప్పారు. ఆ తర్వాత తాను 2015లో ‘కన్నా ప్లీజ్’ అనే ఓ కధను వ్రాసుకున్నాయనని తర్వాత దానికే ‘ప్రేమించొద్దు’ అని టైటిల్ మార్చానని చెప్పారు.
ఆ కధను బేబీ సినిమా నిర్మాత శ్రీనివాస కుమార్ నాయుడుకి వినిపించానని, తర్వాత వారు అదే కధతో 2023లో బేబీ సినిమా తీశారని శిరీన్ శ్రీరామ్ తన పిర్యాదులో పేర్కొన్నారు. రాయదుర్గం పోలీసులు బేబీ దర్శక, నిర్మాతలపై కేసు నమోదు చేశారు. శ్రీమంతుడు సినిమా కాపీరైట్ వివాదం సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. కొరటాల శివపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చని సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరి బేబీ ఎంత దూరం వెళుతుందో?