ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేష్ బాబు-త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సినిమా టీజర్ విడుదల చేసి సినిమా టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు ‘గుంటూరు కారం’ అని టైటిల్ ఖరారు చేశారు. టీజర్లో మహేష్ బాబు నోట్లో దాచుకొన్న బీడీని బయటకు లాగి అంటించుకొంటూ, “ఏంటి అట్టా సూత్తున్నావు? బీడీ త్రీడీలో కనిపిస్తోందా?” అంటూ చెప్పే చిన్న డైలాగ్ చాలు త్రివిక్రం శ్రీనివాస్ మాటల మాంత్రికుడని చెప్పడానికి. టీజర్లో ఊహించిన్నట్లే మహేష్ బాబుతో యాక్షన్ సీన్స్ చూపించారు త్రివిక్రం శ్రీనివాస్.
ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా పూజా హెగ్డే, శ్రీలీల ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్పై ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు అంటే జనవరి 13న సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు టీజర్లో ఖరారు చేశారు.