మూడు రోజుల క్రితం ప్రముఖ సంగీత దర్శకుడు రాజ్ మృతి చెందారు. ఆ మర్నాడు ప్రముఖ నటుడు శరత్ బాబు మృతి చెందారు. శుక్రవారం ప్రముఖ దర్శకుడు కె.వాసు హైదరాబాద్లో మృతి చెందారు. ఆయన గత కొంతకాలం అనారోగ్య సమస్యలతో బాధపడుతూ హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం సాయంత్రం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
అలనాటి ప్రముఖ దర్శకుడు ప్రత్యాగాత్మ కుమారుడే కె.వాసు. తొలిసారిగా కృష్ణంరాజు హీరోగా ‘ఆడపిల్లల తండ్రి’ సినిమాకి దర్శకత్వం వహించారు. ఆ సినిమా సూపర్ హిట్ అవడంతో మరి వెనుతిరిగి చూసుకోలేదు. చిరంజీవిని హీరోగా పరిచయం చేస్తూ ఆయనతో ‘ప్రాణం ఖరీదు’ సినిమా తీశారు. ఆ తర్వాత కోతలరాయుడు, సరదా రాముడు, పక్కింటి అమ్మాయి, కలహాల కాపురం, పుట్టినిల్లా మెట్టినిల్లా, అయ్యప్ప స్వామి మహత్యం, శ్రీ షిర్డీ సాయిబాబా మహత్యం వంటి అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు. వాసు మృతి పట్ల తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్లో ఈ వరుస మరణాలు అందరినీ కలచి వేస్తున్నాయి.