ప్రభాస్ తొలిసారిగా చేస్తున్న పౌరాణిక సినిమా ఆదిపురుష్. దీనిలో శ్రీరాముడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. రూ.500 కోట్ల భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీగా తెర కెక్కించిన ఈ సినిమా జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. అయితే అమెరికాలో ఒక రోజు ముందుగానే అంటే జూన్ 15నే ఈ సినిమా విడుదలకాబోతోంది. కనుక అప్పుడే అక్కడ ఆదిపురుష్ టికెట్స్ అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఆదిపురుష్ 2డి టికెట్స్ ధర 20 డాలర్లుగా, అదే 3డీ టికెట్స్ ధర 23 డాలర్లు ఉంది. అదే... ఆర్ఆర్ఆర్ సినిమా టికెట్ ధరలు 25 నుంచి 28 డాలర్లు వసూలు చేశారు. దాంతో పోలిస్తే ఆదిపురుష్ టికెట్ ధరలు కాస్త తక్కువే. ఈ సినిమాపై చాలా భారీ అంచనాలు ఉండటంతో అమెరికాలో జోరుగా అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతున్నాయి.
ఆదిపురుష్ సినిమా టీజర్, పాత్రల వేషధారణ, గ్రాఫిక్స్ పై చాలా విమర్శలు వెల్లువెత్తినప్పటికీ వాటన్నిటికీ ట్రైలర్తో సమాధానం చెప్పారు. ట్రైలర్, ముఖ్యంగా జైశ్రీరామ్... జైశ్రీరామ్... అంటూ సాగే పాట చాలా అద్భుతంగా ఉండటంతో ఒక్కసారిగా సినిమాపై మళ్ళీ అంచనాలు పెరిగిపోయాయి. రూ.500 కోట్ల భారీ బడ్జెట్తో తీస్తున్న ఈ సినిమా హిట్ అవడం నిర్మాతలకు ఎంత ముఖ్యమో సరైన హిట్ లేకపోయిన ప్రభాస్కు కూడా అంతే ముఖ్యం.
ఈ సినిమాలో సీతమ్మవారీగా కృతీసనన్, ప్రముఖ బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ రావణుడిగా, దేవదత్త నాగే హనుమంతుడిగా, సన్నీ సింగ్ లక్ష్మణుడిగా నటిస్తున్నారు. భూషణ్ కుమార్, కృషన్ కుమార్, దర్శకుడు ఓం రౌత్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ కలిసి ఈ సినిమాను టీ-సిరీస్, రెట్రోఫిలీస్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సచేత్-పరంపర సంగీతం, కార్తీక్ పళని కెమెరా, అపూర్వ మోతీవాలే, ఆశిష్ మాత్రే ఎడిటింగ్ చేస్తున్నారు.