అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప-2 చేస్తున్నాడు. ఇది పూర్తయిన తర్వాత ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే ప్రశ్నకు సమాధానం దొరికింది. మాటల మాంత్రికుడు త్రివిక్రం శ్రీనివాస్తో సినిమాకు ఓకే చెప్పేశాడట. వారిద్దరూ కలిసి చేసిన జులాయి, అల వైకుంఠపురములో సినిమాలు సూపర్ డూపర్ హిట్స్. కనుక ఈ మూడో సినిమాతో హ్యాట్ ట్రిక్ కొట్టడం ఖాయమే.
వీరిద్దరి కాంబినేషన్లో తీయబోతున్న సినిమాను కూడా అల వైకుంఠపురములో సినిమాను నిర్మించిన గీతా ఆర్ట్స్, హారిక అండ్ హాసిని క్రియెషన్స్ బ్యానర్లలో అల్లు అరవింద్, సూర్యదేవర రాధాకృష్ణ కలిపి నిర్మించబోతున్నారు.
ప్రస్తుతం త్రివిక్రం శ్రీనివాస్ కూడా మహేష్ బాబు, పూజా హెగ్డే, శ్రీలీలతో సినిమాని సిద్దం చేస్తున్నారు. పుష్ప-2 పూర్తయ్యేలోగా అదీ పూర్తవుతుంది. లేదా అది పూర్తయ్యాక అల్లు అర్జున్తో సినిమా మొదలుపెడతారు. ఇప్పటికే అల్లు అర్జున్తో సినిమా కోసం త్రివిక్రం శ్రీనివాస్ స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టిన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా తెర కెక్కుతున్న ‘పుష్ప2-ది రూల్’ సినిమా ఈ ఏడాది డిసెంబర్లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాలో ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపి, జగపతి బాబు నటిస్తున్నారు.
ఈ సినిమా తెలుగు, తమిళ్, కన్నడ, మలాయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాని కూడా మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.