ఛత్తిస్ఘడ్ రాష్ట్రంలో భిలాస్పూర్ వద్ద ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఘోర రైలు ప్రమాదం జరిగింది. భిలాస్పూర్ నుంచి కోర్బాకు వెళుతున్న ప్యాసింజర్ రైలు అదే ట్రాక్ మీద నిలిచి ఉన్న గూడ్స్ రైలును బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు ప్రయాణికులు మరణించగా పలువురు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది.
ప్యాసింజర్ రైలు వేగంగా దూసుకువెళ్ళి గూడ్స్ రైలును గుద్దడంతో ఇంజన్ గూడ్స్ వ్యాగన్ మీదకు ఎక్కేసింది. ఈ ధాటికి రైలు బోగీలు చెల్లాచెదురుగా పడిపోగా వాటిలో ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. రైల్వే ట్రాక్ మీద ప్యాసింజర్ బోగీలు చెల్లా చెదురుగా పడిపోవడంతో రైల్వే ట్రాక్ కూడా దెబ్బతింది.
సమాచారం అందుకున్న సౌత్ ఈస్ట్-సెంట్రల్ రైల్వే స్టేషన్ అధికారులు, ఎన్డీ ఆర్ఎఫ్ సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని గాయపడిన ప్రయాణికులను ఆస్పత్రులకు తరలించారు. రైల్వే స్టేషన్ ఇంజనీరింగ్ సిబ్బంది పట్టాలపై పడున్న రైల్వే బోగీలను పక్కకు తప్పించి యుద్ధ ప్రాతిపదికన ట్రాక్ పునరుద్దరిస్తున్నారు. ఈ ప్రమాదం వలన భిలాస్పూర్, కోర్బా మీదుగా వెళ్ళాల్సిన పలు రైళ్ళు రద్దయ్యాయి. కొన్నిటిని వేరే మార్గాలకు మళ్ళిస్తున్నారు. రైల్వే పోలీస్ అధికారులు దర్యాప్తు మొదలుపెట్టారు. ప్రమాదానికి కారణం ఇంకా తెలియాల్సి ఉంది.