ప్రభాస్ ఇదివరకులా మీడియం బడ్జెట్ సినిమాలు, స్ట్రెయిట్ తెలుగు సినిమాలు చేయలేని దశకు చేరుకున్నారు. ప్రభాస్తో సినిమా అంటే కనీసం రూ.400 -500 కోట్లు బడ్జెట్... పాన్ ఇండియా మూవీయే అయ్యుంటుంది.
కానీ ప్రభాస్ కల్కి వంటి అంతర్జాతీయ స్థాయి సూపర్ హిట్ చేసిన తర్వాత మారుతి వంటి దర్శకుడుతో రాజాసాబ్ చేస్తారని ఎవరూ ఊహించి ఉండరు. కానీ చేస్తున్నారు. కనుక దాని బడ్జెట్ కూడా అమాంతం పెరిగిపోయింది. అది కూడా పాన్ ఇండియా మూవీగా మారిపోయింది.
ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో ఆ సినిమా చేస్తూనే, అక్కడే వేరే సెట్స్లో హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజీ’ కూడా చేస్తున్నారు. అంటే ఒకేసారి రెండు సినిమాలు చేస్తున్నారన్న మాట! నిజానికి మారుతి రాజాసాబ్ ఎప్పుడో పూర్తిచేసి ఉండాలి. కానీ అది ఆలస్యం అవడంతో ఇప్పుడు ఫౌజీతో పాటు దానికీ ప్రభాస్ సమయం కేటాయించక తప్పడం లేదు.
రాజాసాబ్ చిత్రంలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా చేస్తుంటే, ఫౌజీలో కొత్త హీరోయిన్ ఇమాన్వీ ప్రభాస్కు జోడీగా చేస్తున్నారు.
హిందీ బయ్యర్స్ అభ్యర్ధన మేరకు ‘రాజాసాబ్’ని డిసెంబర్ 5, 6 తేదీలలో రిలీజ్ చేసే అవకాశం ఉందని నిర్మాత టీజీ విశ్వప్రసాద్ చెప్పారు.