జమ్మూ కశ్మీర్లో మంగళవారం ఉగ్రవాదులు పర్యాటకులపై దాడి చేశారు. వారి దాడిలో 27 మంది పర్యాటకులు ఘటనా స్థలంలోనే చనిపోగా మరో 20 మంది పరిస్థితి చాలా విషమంగా ఉంది.
అనంతనాగ్ జిల్లా, పహల్గామ్ సమీపంలో బైసరన్ అనే ప్రాంతంలో మంగళవారం మద్యాహ్నం సుమారు 3 గంటలకు పర్యాటకులు విహరిస్తున్నప్పుడు, హటాత్తుగా 40 మందికి పైగా ఉగ్రవాదులు వారిని చుట్టుముట్టి వారిపై కాల్పులు జరుపడంతో ఘటనా స్థలంలోనే 27 మంది పర్యాటకులు చనిపోయారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అంత మంది ఉగ్రవాదులు ఒక్కసారిగా తుపాకులతో చుట్టుముట్టి కాల్పులు జరుపుతుండటంతో పర్యాటకులు తప్పించుకు పారిపోయే అవకాశం కూడా లభించలేదు. తుపాకుల మోత విని సమీపంలో ఉన్న భద్రతా దళాలు హుటాహుటిన అక్కడకు చేరుకున్నాయి. కానీ అప్పటికీ ఉగ్రవాదులు అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
స్థానిక ప్రజలు క్షతగాత్రులను గుర్రాలపై ఎక్కించుకొని సమీపంలో ఆస్పత్రులకు తీసుకువెళ్ళి చేర్చారు. ఆ ప్రాంతానికి జీపులు వెళ్ళే పరిస్థితి లేనందున భద్రతా దళాలు కూడా కాలినడకన అక్కడకు చేరుకొని, హెలికాఫ్టర్ ద్వారా క్షతగాత్రులను మిలటరీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలో 20 మంది పరిస్థితి చాలా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
జూలై 3 నుంచి అమర్ నాధ్ యాత్ర మొదలవుతుంది. ఏటా అనేక లక్షల మంది యాత్రికులు ఈ యాత్రలో పాల్గొంటారు.
అనంతనాగ్ జిల్లాలో పహల్గామ్ మీదుగా 48 కిమీ మేర ఈ యాత్ర సాగుతుంది. కనుక యాత్ర కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్న ఈ సమయంలో ఉగ్రవాదులు మెరుపు దాడి చేసి 27 మంది పర్యాటకులను చంపేసి మాయం అయిపోవడంతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం సమీపంలో ఉన్న అడవులలో భద్రతాదళాలు గాలింపు మొదలుపెట్టాయి.