ఒడిశాలో 24 ఏళ్ళుగా ఏకఛత్రాధిపత్యం వహిస్తూ రాష్ట్రాన్ని పాలిస్తున్న నవీన్ పట్నాయక్ తొలిసారిగా ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో ఓడిపోవడంతో ఆ రాష్ట్రంలో తొలిసారిగా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఒడిశా ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మఝీ రేపు (జూన్ 12)న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయనతో పాటు కనకవర్ధన్ సింగ్ దేవ్, ప్రవాతి పరీదా ఉప ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్నారు.
రేపు మధ్యాహ్నం 11.27 గంటలకు గన్నవరంలో చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఈసారి బీజేపీ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తిని తెలంగాణలో 8 ఎంపీ సీట్లు, ఆంధ్రాలో టిడిపి, జనసేనలతో కలిసి 21 ఎంపీ సీట్లు గెలుచుకోగలిగింది. ఏపీలో టిడిపి, జనసేన, బీజేపీల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడబోతుంటే, ఒడిశాలో తొలిసారిగా బీజేపీ సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది.
ఈసారి కేంద్రంలో బీజేపీకి ఆశించిన దాని కంటే చాలా తక్కువ సీట్లు రావడంతో టిడిపి, జనసేన, జేడీయుల మద్దత్తుపై ఆధారపడి ప్రభుత్వం ఏర్పాటుచేయవలసి రావడం బీజేపీకి చాలా అవమానకరంగా ఇబ్బందికరంగానే ఉంది. కనుక ఈసారి ఎన్నికలలో బీజేపీకి కాస్త చేదు,తీపి ఫలితాలు వచ్చిన్నట్లు భావించవచ్చు.