బిఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి నేడు తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డిని కలవనున్నారు. నగరంలో సుచిత్ర క్రాస్ రోడ్ వద్ద గల 1.11 ఎకరాల భూ వివాదంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ తలదూరుస్తున్నారని ఫిర్యాదు చేసేందుకు సిఎంని కలవబోతున్నారు. ఈరోజు మధ్యాహ్నం తర్వాత కలిసేందుకు సిఎం అపాయింట్మెంట్ కూడా ఇచ్ఛిన్నట్లు తెలుస్తోంది.
సుచిత్ర వద్ద గల 1.11 ఎకరాల భూమి మొత్తం తనదే అని మల్లారెడ్డి ఆరోపిస్తుంటే, దానిని మరో 14 మందితో కలిసి చెరో 400 గజాల చొప్పున కొన్నామని కాంగ్రెస్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ వాదిస్తున్నారు.
బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఈ విషయం తాము కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లామని, కానీ మల్లారెడ్డి ఆ భూమి సర్వే చేయించేందుకు కూడా అంగీకరించలేదని లక్ష్మణ్ ఆరోపించారు. అప్పుడు వారి ప్రభుత్వమే అధికారంలో ఉండటం, దానిలో మల్లారెడ్డి మంత్రిగా ఉండటంతో తాము ఏమీ చేయలేక హైకోర్టుని ఆశ్రయించామని చెప్పారు. కానీ మల్లారెడ్డి కోర్టు ఇంజక్షన్ అర్దర్పై కూడా కౌంటర్ దాఖలు చేయకుండా, ఆ భూమి తనదేనంటూ వితండవాదం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యే లక్ష్మణ్ ఆరోపించారు.
కానీ ఆ భూమి తనదేనని, దానికి సంబందించిన పత్రాలన్నీ తన వద్దే ఉన్నాయని మల్లారెడ్డి వాదిస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే తనపై రాజకీయ కక్షతో ఉద్దేశ్యపూర్వకంగానే ఈవిదంగా ఇబ్బంది పెడుతోందని ఆరోపించారు.