ప్రముఖ కవి అందెశ్రీ రచించిన జయ జయహే గీతంలో స్వల్ప మార్పులు చేసి ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి కొత్తగా స్వరపరిచారు. తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడక మునుపు అందెశ్రీ ఈ గీతాన్ని రచించారు. కనుక ప్రత్యేక రాష్ట్రంగా మారిన తర్వాత దానిలో కొన్ని స్వల్ప మార్పులు అవసరమైంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేకంగా ఓ రాష్ట్ర గీతం ఉండాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం అందెశ్రీకి, కీరవాణికి ఈ బాధ్యత అప్పగించింది.
ఈ గీతంలో ఆరు చరణాలు ఉన్నాయి. వాటిలో మొదటి రెండు చరణాలను మాత్రమే తీసుకొని దానిలో తెలంగాణ ఆవిర్భావం సంస్కృతి, సాంప్రదాయాలను తెలియజేసే విదంగా మార్పులు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఆయన సూచనల ప్రకారమే వారిరువురూ దానిలో అవసరమైన చిన్న చిన్న మార్పులు చేసి మళ్ళీ స్వరపరిచి ఆ సీడీని సిఎం రేవంత్ రెడ్డికి అందజేశారు.
జూన్ 2వ తేదీన తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లో జరిగే కార్యక్రమంలో సోనియా గాంధీ ముఖ్య అతిధిగా పాల్గొనబోతున్నారు. ఒకటిన్నర నిమిషాలు నిడివి గల ఈ గీతాన్ని ఆమె చేత విడుదల చేయించబోతున్నారు.