నేడు తెలంగాణ భవన్లో బిఆర్ఎస్ పార్టీ విస్తృత సమావేశంలో ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ లోక్సభ ఎన్నికలలో పోటీ చేయబోతున్న పార్టీ అభ్యర్ధులందరికీ బీఫారంలు, ఒక్కో అభ్యర్ధికి ఎన్నికల ఖర్చుల నిమిత్తం పార్టీ తరపున రూ.95 లక్షల చెక్కులు అందజేశారు.
ఈ సందర్భంగా వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “ఆనాడు మన నలుగురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి మన ప్రభుత్వాన్ని కూల్చేయాలని బీజేపీ కుట్రలు పన్నింది. ఆ ఈ కేసులో బీజేపీ ర్టీ సీనియర్ నేత బిఎల్ సంతోష్ని విచారణకు హాజరు కావాలని తెలంగాణ పోలీసులు నోటీసు ఇచ్చేందుకు ఢిల్లీలోని బీజేపీ కార్యాలయానికి వెళ్ళారు. ప్రధాని నరేంద్రమోడీ దానినే మనసులో పెట్టుకొని మా కుటుంబంపై కక్ష కట్టారు.
అందుకే ఎటువంటి ఆధారాలు లేకపోయినా కల్వకుంట్ల కవితపై మనీలాండరింగ్ కేసు నమోదు చేయించి, అరెస్ట్ చేయించి జైలుకి పంపారు. ఇంత దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా? మన ప్రభుత్వం కూల్చివేయాలనే ఆలోచన చేయడమే తప్పు. మళ్ళీ అందుకు ఈవిదంగా ప్రతీకారం తీర్చుకోవాలనుకోవడం ఇంకా తప్పు.
అయితే కల్వకుంట్ల కవిత ఎటువంటి నేరమూ చేయలేదు. కనుక ఆమెకు తప్పకుండా న్యాయం జరుగుతుంది. నిర్ధోషిత్వాన్ని నిరూపించుకొని బయటపడుతుంది,” అని కేసీఆర్ అన్నారు.