దేవుడిని పార్టీ లీడర్‌ మార్చేసి వాడుకుంటున్నారు!

April 13, 2024


img

తెలంగాణ కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి బీజేపీకి గట్టిగా చురకలు వేశారు. శుక్రవారం పటాన్‌చెరు మండలం రుద్రారంలో కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార రధాలను ప్రారంభించారు. 

ఈ సందర్భంగా ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “రాముడు దేవుడు. కానీ ఆయనను తమ పార్టీకి లీడర్‌గా మార్చేసుకుంది ఓ పార్టీ. ఆ పార్టీ ఏదో మీ అందరికీ తెలుసు. దేవుళ్ళని కూడా రాజకీయాలకు వాడుకునే ఏకైక పార్టీ అది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో రాముడి పేరుతో రాజకీయాలు చేస్తూ ప్రజలను ఓట్లు అడగబోతోంది. 

కానీ మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి ప్రధాన ప్రత్యర్ధి బిఆర్ఎస్ పార్టీయే. కనుక ఆ పార్టీ (బీజేపీ)ని పట్టించుకోనవసరం లేదు. ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న నీలం మధు ముదిరాజ్‌ని గెలిపించుకొని కాంగ్రెస్‌ జెండా ఎగరేద్దాము. 

మెదక్‌లో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకునేందుకు నేను నా కుటుంబ సభ్యులు అందరం కష్టపడుతున్నాము. పార్టీ నేతలు, కార్యకర్తలు అందరూ కూడా మన పార్టీని గెలిపించుకోవడానికి గట్టిగా కృషి చేయాలీ, “ అని జగ్గారెడ్డి విజ్ఞప్తి చేశారు. 

మెదక్ నియోజకవర్గంలో నీలం మధు ముదిరాజ్‌ (కాంగ్రెస్‌), రఘునందన్ రావు (బీజేపీ), వెంకట్రామిరెడ్డి (బిఆర్ఎస్) పోటీ చేస్తున్నారు.

ఎలక్షన్స్ నోటిఫికేషన్‌: మే 18; నామినేషన్స్‌ గడువు: మే 25, పోలింగ్‌: మే 13, ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి: జూన్ 4వ తేదీ.      



Related Post