టిఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్కి సిట్ నోటీస్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ కేసుపై ఆయన చేసిన ఆరోపణలపై వివరణ ఇచ్చి, వాటికి సంబందించిన సాక్ష్యాధారాలను సమర్పించాల్సిందిగా సిట్ నోటీసులో పేర్కొంది. కానీ తనకు సిట్ నోటీస్ అందలేదని కనుక దానిలో ఏమి పేర్కొన్నారో చూడకుండా విచారణకు హాజరుకాలేనని చెపుతూ బండి సంజయ్ ఈరోజు డుమ్మా కొట్టారు.
పోలీసులు రెండు రోజుల క్రితం బండి సంజయ్కి నోటీస్ అందించేందుకు బంజారాహిల్స్లో ఆయన నివాసానికి వెళ్ళగా ఆయన ఇంట్లో లేకపోవడంతో నోటీసును గోడకి అంటించి వచ్చేశారు. ఆ తర్వాత తనకు నోటీస్ పంపించిన విషయం గురించి బండి సంజయ్ స్వయంగా మీడియాకు చెప్పారు కూడా. కానీ మీడియా ద్వారానే తనకు నోటీస్ పంపిన విషయం తెలిసిందని, దానిలో ఏమి వ్రాశారో చూడలేదని, తాను ఎంపీని కనుక పార్లమెంట్ సమావేశాలకు హాజరుకావలసి ఉందని కనుక నేడు విచారణకు హాజరుకాలేనని తెలియజేస్తూ బండి సంజయ్ సిట్కి ఓ లేఖ వ్రాశారు. కనుక ఇప్పుడు సిట్ అధికారులు ఏవిదంగా స్పందిస్తారో చూడాలి.