జార్ఖండ్ రాష్ట్రంలో సోమవారం రాత్రి ఓ ఎయిర్ అంబులెన్స్ (విమానం) కూలిపోయింది. ఆ రాష్ట్ర రాజధాని రాంచీ నుంచి కాలిన గాయాలతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న సంజయ్ కుమార్ అనే ఓ వ్యక్తిని అత్యవసరంగా మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ (విమానం)లో ఢిల్లీకి తరలిస్తుండగా అది చత్రా జిల్లాలో సీమరియా వద్ద అటవీ ప్రాంతంలో కూలిపోయింది.
సోమవారం రాత్రి 7.11 గంటలకు రాంచీ ఎయిర్ పోర్ట్ నుంచి బయలుదేరిన రెడ్ బర్డ్ ఎయిర్ వేస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన సీ-90 విమానం 7.34 గంటలకు ఏటీసీతో సంబంధాలు తెగిపోయాయి. ఆ తర్వాత కొద్ది సేపటికే విమానం అటవీ ప్రాంతంలో కుప్పకూలిపోయింది.
ఈ ప్రమాదంలో రోగి సంజయ్ కుమార్తో ఇద్దరు విమాన పైలట్లు, వైద్యుడు, ముగ్గురు వైద్య సిబ్బంది చనిపోయారు. విమానం రాత్రి 10గంటలకు ఢిల్లీ చేరుకోవాల్సి ఉండగా మార్గమధ్యంలోనే ఈ దుర్ఘటన జరిగింది. ఒకరి ప్రాణాలు కాపాడబోతే ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.