మెగాస్టార్ చిరంజీవికి సొంతంగా ఇల్లు నిర్మించుకోవడం కష్టమా? అంటే కాదనే అందరికీ తెలుసు. కానీ ఇల్లు సంగతి దేవుడెరుగు.. ప్రహారీగోడ నిర్మించుకుని దానిని తనికీ చేసి క్రమబద్దీకరించాలని కోరితే జీహెచ్ఎంసీలో పట్టించుకునే నాధుడే లేడు. దాంతో ఆయన దీని కోసం హైకోర్టుని ఆశ్రయించాల్సి వచ్చింది!
చిరంజీవి 2002లో జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకొని జూబ్లీహిల్స్లో జీ+2 ఇల్లు, దాని చుట్టూ ప్రహారీగోడ నిర్మించుకున్నారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత జీహెచ్ఎంసీ సిబ్బంది వచ్చి తనికీలు చేసి తమకు సమర్పించిన ప్లాన్, డ్రాయింగ్ ప్రకారం ఇంటి నిర్మాణం జరిగిందా ఏమైనా ఉల్లంఘనలు జరిగాయా?అనేది నిర్ధారించాల్సి ఉంది. ఇంటి నిర్మాణం పూర్తికాగానే చిరంజీవి దీని కోసం దరఖాస్తు చేసుకున్నారు కూడా.
కానీ ఇంతవరకు అంటే.. 23 ఏళ్ళు గడిచినా జీహెచ్ఎంసీ పట్టించుకోలేదు. అలాగని వదిలేస్తే భవిష్యత్లో అక్రమ నిర్మాణం అంటూ జీహెచ్ఎంసీ సిబ్బందే ఇంటిని కూలగొట్టేందుకు రావచ్చు. కనుక దీని కోసం చిరంజీవి హైకోర్టులో ఓ పిటిషన్ వేశారు. ఆయన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయస్థానం చిరంజీవి దరఖాస్తుని తక్షణం పరిష్కరించి ఆయనకు తగిన సర్టిఫికెట్ జారీ చేయాలని ఆదేశించింది. మెగాస్టార్ చిరంజీవినే జీహెచ్ఎంసీ పట్టించుకోకపోతే సామాన్యుల పరిస్థితి?