ప్రముఖ తెలుగు సినీ నటుడు రఘుబాబుని నల్గొండ రెండో పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన కారు ఓ ద్విచక్రవాహనాన్ని వెనుక నుంచి ఢీకొనడంతో దానిపై ప్రయాణిస్తున్న సందినేని జనార్ధన్ రావు (48) ఘటనా స్థలంలోనే చనిపోయాడు. బుధవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో రఘుబాబు స్వయంగా కారు డ్రైవ్ చేస్తున్నారు.
మృతుడు బిఆర్ఎస్ పట్టణ కార్యదర్శిగా పోలీసులు గుర్తించారు. రఘుబాబు గుంటూరు నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా, నల్గొండ పట్టణంలో శ్రీనగర్ కాలనీ సమీపంలో లెప్రసీ కాలనీ వద్ద గల ఫామ్హౌస్ వద్ద యూటర్న్ తీసుకొంటున్నప్పుడు, జనార్ధన్ రావు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వెనక నుంచి బలంగా ఢీ కొన్నారు. ఆ ధాటికి జనార్ధన్ రావు ఎగిరి డివైడర్పై పడటంతో తల, ఛాతికి బలమైన గాయాలై వెంటనే చనిపోయాడు.
జనార్ధన్ రావుకు భార్య నాగమణి, ఓ కుమార్తె, ఓ కుమారుడు ఉన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని రఘుబాబుని అరెస్ట్ చేశారు. తర్వాత షరతులతో కూడిన వ్యక్తిగత పూచీకత్తుపై ఆయనకు బెయిల్ పొంది హైదరాబాద్ వెళ్ళిపోయారు.