హైదరాబాద్ నగరంలో భారీగా కురుస్తున్న వానలతో నాళాలు పొంగి ప్రవహిస్తున్నాయి. శనివారం మణికొండ గోల్డెన్ టెంపుల్ వద్ద గోపిశెట్టి రజనీకాంత్ అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తెరిచిఉన్న మ్యాన్హోల్లో పడి ఉదృతంగా ప్రవహిస్తున్న నాలాలో కొట్టుకుపోయాడు. విషయం తెలుసుకొని యువకుడి కోసం జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది నాలా పొడవునా గాలింపు చేపట్టగా, ఈరోజు ఉదయం నెక్నంపూర్ చెరువులో అతని మృతదేహం లభించింది. రజనీకాంత్ షాద్నగర్లోని నోవా గ్రీన్ సిగ్నల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి సుమారు 9 గంటలకు డ్యూటీ ముగించుకొని ఇంటికి తిరిగివెళుతుండగా, ప్రమాదవశాత్తూ నిర్మాణంలో ఉన్న మ్యాన్హోల్లో పడిపోయాడు. పోలీసులు అతని మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.