తెలంగాణలో మరికొన్ని రోజులలో పెళ్లిళ్ల సీజన్ ప్రారంభమవుతుంది. రాష్ట్రంలో కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం తాజా కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వివాహ వేడుకలకు ముందుగా తహసీల్దార్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. విపత్తు నిర్వహణ చట్ట ప్రకారం వివాహానికి గరిష్టంగా 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఒకవేళ అంతకుమించి ఎక్కువమంది వివాహానికి హాజరైతే విపత్తు నిర్వహణ చట్టం కింద కేసులు నమోదు చేస్తారు. వధువరుల తరపువారు వేర్వేరుగా తహసీల్దార్కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుతో పాటు వధూవరుల, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, శుభలేఖ జిరాక్స్ కాపీ, వివాహంలో కరోనా జాగ్రత్తలన్నీ తప్పక పాటిస్తామని, 50 మందికి మించి అతిధులను ఆహ్వానించబోమని వ్రాతపూర్వకంగా తహసీల్దార్కు అఫిడవిట్ను సమర్పించాలి. అప్పుడు ఆయా ప్రాంతాలలో కరోనా కేసులు నమోదు కాని చోట ఉన్న కళ్యాణ మండపంలో లేదా పెళ్ళివారి నివాసంలో పెళ్ళిళ్ళకు తహసీల్దార్ అనుమతిస్తారు.