ఈసారి ఖైరతాబాద్ మహా గణపతిని శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి రూపంలో అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. గత మూడేళ్ళుగా ఏడాదికి అడుగు చొప్పున విగ్రహం ఎత్తు తగ్గించుకొంటూ వస్తున్న ఖైరతాబాద్ గణేశ్ నిర్వాహకులు ఈసారి 57 అడుగులు ఎత్తు, 24 అడుగులు వెడల్పుతో గణనాధుని విగ్రహం రూపొందించారు. ఏడు శిరస్సులు, 14 హస్తాలతో పైన కాలసర్పాల పడగాలతో గణనాధునికి గొడుగు పడుతున్నట్లు విగ్రహాన్ని తీర్చిదిద్దారు.
ఈ ఏడాది గవర్నర్ నరసింహన్ దంపతులు ఖైరతాబాద్ గణేషునికి తొలి పూజలు చేయలేని స్థితిలో ఉన్నందున శ్రీ పీఠం అధిపతి పరిపూర్ణనంద స్వామి ఉదయం 11 గంటలకు తొలి పూజలు చేయబోతున్నారు. స్వామివారి దర్శనం కోసం భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు కనుక ఖైరతాబాద్ పరిసర ప్రాంతాలలో నేటి నుంచి సెప్టెంబర్ 23వ తేదీ వరకు ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు నగర పోలీస్ కమీషనర్ అంజనీ కుమార్ తెలిపారు.