తెలంగాణ పిసిసి అధ్యక్షుడు, సిఎం రేవంత్ రెడ్డి నేటి నుంచి వచ్చే నెల 11వ తేదీ సాయంత్రం ఎన్నికల ప్రచారం గడువు ముగిసేవరకు తెలంగాణ అంతటా పర్యటిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు. రాష్ట్రంలో 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో గల 50 అసెంబ్లీ నియోజకవర్గాలలో సిఎం రేవంత్ రెడ్డి వరుసగా రోడ్ షోలు, బహిరంగ సభలు నిర్వహిస్తూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
ముందుగా ఈరోజు మధ్యాహ్నం మహబూబ్ నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్ధిగా లోక్సభకు పోటీ చేస్తున్న వంశీ చంద్ రెడ్డి నామినేషన్ దాఖలు కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. ఈరోజు సాయంత్రం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న తర్వాత అక్కడి నుంచి మహబూబాబాద్ చేరుకొని ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు.
రేపు (శనివారం) మెదక్ అభ్యర్ధి నీలం మధుకి మద్దతుగా ర్యాలీలో పాల్గొంటారు. ఆదివారం భువనగిరిలో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ నామినేషన్స్ కార్యక్రమం, రోడ్ షోలో పాల్గొంటారు. మర్నాడు (ఏప్రిల్ 22) మధ్యాహ్నం ఆదిలాబాద్, ఏప్రిల్ 23న నాగర్కర్నూల్, 24న ఉదయం జహీరాబాద్ సాయంత్రం వరంగల్ సభలలో పాల్గొంటారు. ఏప్రిల్ 25న చేవెళ్ళ కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డికి మద్దతుగా ర్యాలీ, ఎన్నికల సభలో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు.