దేశ ప్రజలు కేసీఆర్ నాయకత్వం కోరుకొంటున్నారని బిఆర్ఎస్ నేతలు చెప్పుకొంటుంటే, ‘ఇంట్లో ఈగల మోత... బయట పల్లకీల మోతన్నట్లు’ తెలంగాణలో మాత్రం ప్రతిపక్షాలు ఆయనని దుమ్మెట్టి పోస్తూనే ఉన్నాయి. ఏపీలో జగనన్నతో విభేదించిన వైఎస్ షర్మిల ఇక్కడ తెలంగాణలో తండ్రిపేరు చెప్పుకొంటూ పాదయాత్ర చేస్తున్నారు. కానీ ప్రజలు, మీడియా కూడా పెద్దగా పట్టించుకోకపోవడంతో హైకోర్టు వద్దని చెప్పినప్పటికీ సిఎం కేసీఆర్పై తీవ్ర విమర్శలు చేస్తూ అందరి దృష్టిని ఆకర్శించేందుకు విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆ మద్యన హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులు ఆమెని కారు దిగమన్నా దిగకుండా కూర్చొని అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్ళీ ఇప్పుడు సిఎం కేసీఆర్ని తనతో పాదయాత్ర చేయమని సవాలు చేస్తూ వాకింగ్ షూస్ బహుమతిగా పంపిస్తున్నానని చెప్పారు.
ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్గారు నెత్తి మీద ఓ టోపీ పెట్టుకొని పిట్టలదొరలా కబుర్లు చెపుతూ ప్రత్యేక విమానాలేసుకొని దేశాటన చేస్తుంటారు. ఆయనకి ప్రజల సమస్యలు తెలియవు. పట్టవు. ఎందుకంటే ఏనాడూ వారి మద్యకి వెళ్ళరు వారితో మాట్లాడరు కనుక! కనుక ఆయనకి దమ్ముంటే నాతో పాటు పాదయాత్ర చేయాలని సవాలు చేస్తున్నాను. పాదయాత్ర చేయడానికి ఆయనకి మంచి షూస్ కొని ఆయనకి బహుమతిగా పంపిస్తున్నాను. ఒకవేళ ఆ షూస్ సరిపోకపోతే మార్చుకొనేందుకు వాటి బిల్లు కూడా పంపిస్తున్నాను,” అని అన్నారు.