సిఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం ప్రగతి భవన్లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఇటీవల కేంద్రప్రభుత్వం అమలులోకి తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)ను రద్దు చేయాలని కోరుతూ శాసనసభలో తీర్మానం చేయాలని నిర్ణయించారు. లౌకికదేశమైన భారతదేశంలో మత వివక్షను ప్రోత్సహించే సీఏఏను అమలుచేసినట్లయితే దేశంలో మతసామరస్యం దెబ్బ తింటుందని మంత్రివర్గం అభిప్రాయపడింది. అందుకే కేంద్రప్రభుత్వం ఈ బిల్లును లోక్సభలో ప్రవేశపెట్టినప్పుడే టిఆర్ఎస్ ఎంపీల చేత వ్యతిరేకింపజేసి తెలంగాణ ప్రభుత్వ అభిప్రాయాన్ని విస్పష్టంగా యావత్ దేశానికి చాటిచెప్పామని, కనుక అదే వైఖరికే కట్టుబడి సీఏఏను వ్యతిరేకిస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రప్రభుత్వానికి పంపించాలని సమావేశంలో నిర్ణయించారు. ఒకవేళ కేంద్రప్రభుత్వం సీఏఏపై వెనక్కు తగ్గకుంటే హైదరాబాద్లో భారీ బహిరంగసభ ఏర్పాటు చేసి ప్రజల గొంతును డిల్లీ పాలకులకు గట్టిగా వినిపించాలని సమావేశంలో నిర్ణయించారు.