ధర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ...పృధ్వీరాజ్, కృష్ణుడు, జయసుధ, అలీ...తెలుగు సినీపరిశ్రమ ప్రముఖులు వైకాపాకు క్యూ కడుతున్నారు. ఆ జాబితాలో ప్రముఖ సినీ నిర్మాత, పారిశ్రామికవేత్త పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) పేరు కూడా చేరింది. ఆయన రేపు ఉదయం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లు తాజా సమాచారం.
గత ఎన్నికలలోనే ఆయన వైకాపా లేదా టిడిపి టికెట్ పై విజయవాడ నుంచి లోక్సభకు పోటీ చేయాలని గట్టిగా ప్రయత్నించారు. ఆయనకు అత్యంత సన్నిహితుడైన పవన్కల్యాణ్ గత ఎన్నికలలో టిడిపికి మద్దతు ఇచ్చినందున ఆయనకు టికెట్ కోసం సిఫార్సు చేశారని కానీ విజయవాడ టికెట్ కోసం టిడిపిలో పోటీ ఎక్కువ ఉండటంతో పొట్లూరికి లభించలేదని వార్తలు వచ్చాయి. అప్పుడే ఆయన వైకాపా టికెట్ కోసం కూడా గట్టిగా ప్రయత్నించారు. కానీ ఆ పార్టీలో కూడా టికెట్ కోసం గట్టి పోటీ నెలకొని ఉండటంతో పొట్లూరికి టికెట్ లభించలేదు కనుక రాజకీయ ప్రవేశం చేయకుండా ఆగిపోయారు. ఈసారి తప్పక టికెట్ లభిస్తుందని జగన్ నుంచి హామీ లభించినందునే ఆయన రేపు వైకాపాలో చేరేందుకు సిద్దం అవుతున్నారని తాజా సమాచారం. అయితే వైకాపాలో ఇప్పటికే జైరమేష్, అమలాపురం ఎంపీ పి రవీంద్రబాబు విజయవాడ లోక్సభ టికెట్ ఆశిస్తున్నారు. టికెట్ కోసమే వారిరువురూ టిడిపిని వీడి వైకాపాలో చేరారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో జగన్ ఎవరికి టికెట్ ఇస్తారో చూడాలి.