మాజీ ఐపిఎస్ అధికారి, బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ మళ్ళీ చాలా రోజుల తర్వాత నేడు మీడియా ముందుకు వచ్చారు. ఇంతకీ విషయం ఏమిటంటే, ఆయన గురుకుల పాఠశాల ఉపాధ్యాయుల నియామక విధానంలో లోపాలను ఎట్టి చూపి ప్రభుత్వానికి చక్కటి సలహా ఇచ్చారు.
డిగ్రీ లెక్చరర్స్, పీజీటీ, టీజీటీ ఉద్యోగ నియామకాలలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొని పరీక్షలు వ్రాసి చాలా మంది ఉత్తీర్ణులవుతుంటారు. వాటిలో వారు ఏదో ఓ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకొని మిగిలినవాటిని విడిచి పెట్టేస్తుంటారు.
వాటిని మెరిట్ లిస్టులో వరుసగా రెండో స్థానం నుంచి ఉన్నవారికి కేటాయించాలి. కానీ కేటాయించకుండా వదిలేస్తున్నారు. దాంతో ఆ ఉద్యోగాలు భర్తీ కాకుండా ఉండిపోతున్నాయి. మరోపక్క మెరిట్ లిస్టులో ఉన్నవారికి ఆ ఉద్యోగాలు దక్కకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు.
కనుక ఈ లోపాన్ని సవరించి తక్షణం ఖాళీగా ఉన్న ఆ ఉద్యోగాలన్నిటినీ భర్తీ చేయాలని ప్రవీణ్ కుమార్ ప్రభుత్వానికి సూచించారు. ఇది చాలా మంచి సలహాయే. కనుక ప్రభుత్వం దీనిపై దృష్టి పెడితే బాగుంటుంది.