తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినందున ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ (డీఎస్సీ)లో కొత్త రోస్టర్ ప్రకారమే నియమకాలు చేపట్టాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకొంది. ఇందులో భాగంగా రోస్టర్లో పాయింట్:1 నుంచి ప్రారంభించింది. దీంతో కొత్త రిజర్వేషన్స్ విధానం కూడా అమలులోకి వచ్చింది.
తెలంగాణ పాఠశాల విద్యాశాఖ మంగళవారం కొత్త రోస్టర్ను విడుదల చేసింది. దాని ప్రకారం రిజర్వేషన్స్ ఉంటాయని తెలియజేస్తూ రాష్ట్రంలో 5,089 ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఆన్లైన్లో దరఖాస్తులు కూడా స్వీకరిస్తోంది. నిన్న (మంగళవారం) అర్దరాత్రి 12 గంటల నుంచి వచ్చే నెల 21 వరకు ఆన్లైన్లో దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ ఉద్యోగాలకు సంబందించిన పూర్తి వివరాలు పాఠశాల విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు.
ఈ డీఎస్సీలో మొత్తం 5,89 పోస్టులు ఉండగా వాటిలో మహిళలకు 2,638 పోస్టులు రిజర్వ్ చేయడంతో ఈసారి మహిళలకు మంచి అవకాశం లభించింది. వీటితో పాటు ఓపెన్ జనరల్ కోటాలో కూడా దరఖాస్తు చేసుకొని పురుష అభ్యర్ధులతో పోటీ పడే అవకాశం కల్పించింది.
హనుమకొండలో మొత్తం 54 పోస్టులు ఉండగా వాటిలో 40 మహిళలకే కేటాయించబడ్డాయి. అదేవిదంగా పెద్దపల్లి జిల్లాలో 43 పోస్టులకు 31 మహిళలకే కేటాయించబడ్డాయి. ఉపాధ్యాయ ఉద్యోగాలలో ఇంత పెద్ద ఎత్తున మహిళలకు ఇదివరకు ఎన్నడూ అవకాశం లభించలేదు. కనుక ఈసారి మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే మంచిది.