ఒడిశాలోని పూరీలో జరుగుతున్న జగన్నాథ రథయాత్రలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు భక్తులు ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడినట్లు అధికారులు తెలిపారు. ఎప్పటిలాగే ఈసారి రథయాత్రకు 10 లక్షలు పైగా భక్తులు తరలివచ్చారు.
కనుక పోలీసులు భారీగా ఏర్పాట్లు చేశారు. అయితే ఆలయ పూజారులు గర్భగుడిలో నుంచి దేవతా మూర్తులను రథాల వద్దకు తీసుకువస్తున్నప్పుడు దర్శనం చేసుకునేందుకు భక్తులు ముందుకు దూసుకు రావడంతో పరిస్థితి అదుపు తప్పి తొక్కిసలాట జరిగింది.
గాయపడిన వారిని వెంటనే పూరీ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన అనంతరం సహాయక బృందాలు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకు వచ్చారు.
ఈ ఘటనపై ఒడిశా ప్రభుత్వం ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది. అనంతరం అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు సీనియర్ అధికారులను బదిలీ చేసింది. ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ప్రకటించింది.