ప్రతీ నెల కనీసం ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకి మంటలు అంటుకోవడం, అదృష్టం బాగుంటే ప్రయాణికులు ప్రాణాలతో బయటపడటం లేకుంటే సజీవ దహనం అవుతున్న వార్తలు చూస్తూనే ఉన్నాము. కనుక ‘స్లీపర్ బస్సు’లను రద్దు చేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు యోచిస్తున్నాయి.
స్లీపర్ బస్సులలో ప్రయాణికుల ప్రైవసీ కోసం కర్టెన్స్ ఉంటాయి. కానీ వాటి స్థానంలో కొన్ని బస్సులలో అద్దాలు బిగిస్తున్నారు. ఒకవేళ ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నప్పుడు బస్సుకి మంటలు అంటుకుంటే, వారు మేల్కొని ఆ అద్దాలు తలుపులు తెరుచుకొని బయటపడటం ఇంకా కష్టం.
కనుక అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రయాణికులు తప్పించుకొని బయటపడే అవకాశాలు ఇంకా తగ్గుతాయి. ఈవిషయం తెలంగాణ రవాణాశాఖ దృష్టికి రావడంతో వెంటనే ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులలో సోదాలు నిర్వహించడం మొదలుపెట్టారు.
ఇటువంటి ఏర్పాటు కలిగిన ప్రియా ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సుని స్వాధీనం చేసుకొని బస్సు యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. జాయింట్ కమీషనర్గా చంద్రశేఖర్ గౌడ్ హైదరాబాద్ నగరానికి రాకపోకలు సాగించే ప్రైవేట్ ట్రావెల్స్ సంస్థల ప్రతినిధులతో ఇటీవల సమావేశమయ్యారు.
బస్సులలో ప్రయాణికులకు సౌకర్యాలు కల్పించడం మంచిదే కానీ అవే వారి భద్రతకు ప్రమాదకరంగా మారకూడదని సూచించారు. బస్సు ఆపరేటర్లు అందరూ తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని లేకుంటే చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.