జానపద గాయని మంగ్లీపై లాయర్ సుబ్బారావు పిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా దానిపై ఆమె తీవ్రంగా స్పందించారు. “నేను అయన కంటే ముందే ఆయనపై నార్సింగి పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశాను.
ఈ కేసుతో, సోషల్ మీడియాలో చూపిన ఆ నోట్ల కట్టలతో నాకు ఎటువంటి సంబంధమూ లేదు. ఓ గాయనిగా తెలంగాణ రాష్ట్రంలో నాకున్న పేరు ప్రతిష్టలకు భంగం కలిగే విధంగా లాయర్ సుబ్బారావు నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కనుక నేనే ఆయనపై కేసు పెట్టాను. నాపై అసత్య ఆరోపణలు చేస్తూ నా ప్రతిష్టకు భంగం కలిగిస్తే చూస్తూ ఊరుకోను. ఇకనైనా ఇటువంటి పనులు మానుకుంటే మంచిది,” అని మంగ్లీ హెచ్చరించారు.
ఆమె, ఆమె సోదరుడు శివ, దర్శకుడు వేణు ఊడిగల తనను ఈ కేసు నుంచి తప్పుకోవాలని లేకుంటే రోడ్డుపై వాహనంతో గుద్దించి చంపేస్తానని ఫోన్లు చేసి బెదిరించారంటూ లాయర్ సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయగా వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ ఇప్పుడు ఆయనే తనని బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ మంగ్లీ ఆరోపించడంతో కేసు కొత్త మలుపు తిరిగింది.