ఏపీలో ఈరోజు తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఏపీలో పామూరుకి వెళ్తున్న హరికృష్ణ ట్రావెల్స్ సంస్థకు చెందిన బస్సుని మార్కాపురం జిల్లా రాయవరం సమీపంలో ఓ మలుపు వద్ద ఎదురుగా అతివేగంగా దూసుకువచ్చిన టిప్పర్ బలంగా ఢీ కొట్టింది.
దీంతో టిప్పర్ డీజిల్ ట్యాంక్ పగిలి మంటలు అంటుకున్నాయి. టిప్పర్ నుంచి బస్సుకి శరవేగంగా మంటలు వ్యాపించాయి. బస్సు ముందు సీట్లలో కూర్చున్నవారు వెంటనే బయటపడగలిగారు. కానీ వెనుక సీట్లలో ఉన్నవారు మంటలలో చిక్కుకొని సజీవదహనం అయిపోయారు.
ఈ ప్రమాదం జరిగినప్పుడు బస్సులో మొత్తం 30 మంది ప్రయాణికులున్నారు. వారిలో 14 మంది సజీవ దహనం అయిపోయారు. మిగిలినవారిలో 15 మంది బయటపడ్డారు. కానీ వారిలో కొంతమంది తీవ్రంగా గాయాలయ్యాయి.
ఈ సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలు ఆర్పేశారు. గాయపడిన వారిని పోలీసులు మార్కాపురంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి మృతదేహాలను బయటకు తీస్తున్నారు. కానీ మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. ఈ ఘోర ప్రమాదం, విషాద ఘటనపై ఏపీ సిఎం చంద్రబాబు నాయుడు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.