మొంథా తుఫాను రాష్ట్రంపై విరుచుకు పడటంతో పలు జిల్లాలలో రోడ్లు కొట్టుకుపోగా కొన్ని చోట్ల వంతెనలకు పాక్షికంగా దెబ్బ తిన్నాయి. నాగర్కర్నూల్ జిల్లాలోని ఉప్పునుంతల మండలంలోని లత్తిపూర్ గ్రామం వద్ద డిండి అలుగు వంతెనలో కొంత భాగం వరద ధాటికి కూలిపోయింది.
దీంతో దాని మీదుగా హైదరాబాద్-శ్రీశైలం మద్య రాకపోకలు సాగించే వాహానాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. వంతెనకు ఇరువైపులా పోలీసులను మొహరించి, బ్యారికేడ్లు ఏర్పాటు చేసి ప్రజలు, వాహనాలు వంతెనపైకి వెళ్ళకుండా అడ్డుకుంటున్నారు.
మొంథా తుఫానుతో ఎలాగూ వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. పలు జిల్లాలలో ఇలా రోడ్లు కొట్టుకుపోయి, వంతెనలు కూలిపోవడంతో మళ్ళీ వాటన్నిటినీ పునర్నిస్తే తప్ప రాకపోకలు సాగించే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సహా కేంద్ర మంత్రులు అందరూ బీహార్ శాసనసభ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు.
తెలంగాణలో మంత్రులు, ప్రతిపక్షాలు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంతో బిజీగా ఉన్నాయి. కనుక రాష్ట్రంలో తుఫాను వలన కలిగిన ఈ నష్టాలను, ఈ సమస్యలను ఎప్పటికి పరిష్కరిస్తారో ఎవరూ చెప్పలేకపోతున్నారు.