రెండు రోజుల క్రితమే మహేశ్వరం పోలీసులు హైదరాబాద్ శివారులో ఓ రేవ్ పార్టీపై దాడి చేసి దానిలో పాల్గొన్న ఎరువుల కంపెనీల యజమానులపై కేసులు నమోదు చేశారు. 24 గంటల వ్యవధిలోనే హైదరాబాద్లో మరో రేవ్ పార్టీ జరిగింది. పోలీసులు దాడి చేసి భగ్నం చేశారు. ఈసారి రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లింగంపల్లి శివారులో గల ఓ ఫామ్హౌసులో రేవ్ పార్టీ జరిగింది.
కాచిగూడకు చెందిన వ్యాపారి రుద్రశెట్టి సప్తగిరి లింగంపల్లిలో తన ఫామ్హౌసులో ఈ రేవ్ పార్టీ ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ రేవ్ పార్టీలో పలువురు రాజకీయ ప్రముఖుల బంధువులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, కాంట్రాక్టర్లు ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నారు.
ఈ రేవ్ పార్టీ కోసం ముంబాయి, పశ్చిమ బెంగాల్, విశాఖపట్నం నుంచి యువతులను తీసుకువచ్చారని పోలీసులు తెలిపారు. వారు అశ్లీల నృత్యాలు చేస్తుండగా పార్టీలో పాల్గొన్నవారు విదేశీ మద్యం సేవిస్తూ చిందులు వేస్తున్నప్పుడు మంచాల పోలీసులు దాడి చేశారు.
పార్టీలో 25 మంది పురుషులు, 8 మంది మహిళలు ఉన్నారు. వారి నుంచి భారీగా నగదు, విదేశీ మద్యం సీసాలు, మొబైల్ ఫోన్లు, వారి 11 కార్లు పోలీసులు స్వాధీనం చేసుకొని కేసులు నమోదు చేశారు. తర్వాత స్టేషన్ బెయిల్పై అందరినీ విడుదల చేశారు.