బర్రెలక్క అలియాస్ కర్ణే శిరీష తన బంధువర్గానికి చెందిన వెంకటేష్ అనే యువకుడిని వివాహం చేసుకొంది. నాగర్కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలోని పిఎంఆర్ గార్డెన్ వీరి వివాహం వేడుకగా జరిగింది.
బర్రెలక్కగా ఆమె అందరికీ చిర పరిచితురాలు కనుక బందు మిత్రులతో పాటు పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు వారి వివాహానికి వచ్చి నూతన దంపతులను ఆశీర్వదించారు.
ఆమె తన ప్రీ-వెడ్డింగ్, పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో శ్రేయోభిలాషులతో పంచుకోవడంతో దేశ విదేశాలలో ఉన్నవారు కూడా వారికి శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు తెలియజేస్తున్నారు.
శిరీష డిగ్రీ చదివిన ఉద్యోగం రాకపోవడంతో బర్రెలు కాసుకొని జీవిస్తున్నానంటూ కొన్ని సంవత్సరాల క్రితం సోషల్ మీడియాలో పెట్టిన ఓ వీడియో వైరల్ అవడంతో ఆమె యావత్ తెలంగాణ ప్రజలకు సుపరిచితురాలుగా మారింది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండటమే కాక ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్ధిగా పోటీ చేయడంతో ఇంకా పాపులర్ అయ్యింది.
ఆ సమయంలో ఆమె పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ఒక పార్టీ అభ్యర్ధి ప్రయత్నించడంతో ఆమె పోలీసులను ఆ తర్వాత హైకోర్టుని ఆశ్రయించడంతో ఇంకా పాపులర్ అయ్యింది.
ఆ రాజకీయ నాయకుడు నుంచి ఎన్ని ఒత్తిళ్ళు వచ్చినప్పటికీ ఆమె వెనక్కు తగ్గకుండా ఎన్నికలలో పోటీ చేయడంతో పలువురు ప్రముఖులు సైతం ఆమె పట్టుదల, ధైర్యానికి అభినందించారు.
ఆమెకు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్ బుక్లో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నప్పటికీ, ఎన్నికలు కోట్ల రూపాయల వ్యవహారంగా మారినందున ఆమె ఓడిపోయారు. కానీ ఆమె పోరాట స్పూర్తి ఎంతో మంది ఆడపిల్లలకు స్పూర్తినిచ్చిందని చెప్పవచ్చు. మై తెలంగాణ.కామ్ పాఠకుల తరపున శిరీష, వెంకటేష్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తోంది.