సూర్యపేటలో విషాదం...ఆరుగురు గల్లంతు

October 19, 2019
img

సూర్యాపేట జిల్లాలోని కోదాడ నియోజకవర్గం నడిగూడెంలోని చాకిరాల గ్రామం వద్ద శనివారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. 

హైదరాబాద్‌ ఈసీఐఎల్‌లోని అంకుర ఆస్పత్రిలో పనిచేస్తున్న ఆరుగురు ఉద్యోగులు ప్రయాణిస్తున్న స్కార్పియో వాహనం అదుపు తప్పి నాగార్జునసాగర్ ఎడమకాలువలోకి దూసుకుపోవడంతో వారందరూ గల్లంతయ్యారు. అదే ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవరుగా పనిచేస్తున్న తమ స్నేహితుడు విమలకొండ మహేశ్ పెళ్ళికి వెళ్ళి తిరిగి వస్తుండగా ఈ ఘోరప్రమాదం జరిగింది. 

ఈ ప్రమాదంలో స్కార్పియోలో ఉన్న పవన్ కుమార్ (23), సంతోష్ కుమార్ (23), రాజేష్ (29), జాన్సన్ (33), నాగేశ్ (35), అబ్దుల్ అజీత్ (45) గల్లంతయ్యారు. 

వారి వెనుకే మరో వాహనంలో మరో నలుగురు స్నేహితులు వస్తున్నారు. తమ కళ్ళ ముందే స్కార్పియో నీట మునిగిపోవడంతో వారందరూ షాక్‌కు గురయ్యారు. వారు కూడా అంకుర ఆస్పత్రిలో ఉద్యోగులే. 

సమాచారం అందుకొన్న పోలీసులు, సహాయ సిబ్బంది అక్కడకు చేరుకొని నదిలో గాలింపు మొదలుపెట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. హాయిగా...సరదాగా సాగిన వారి ప్రయాణం ఇంత విషాదంగా ముగియడంతో అందరూ షాక్‌లో ఉన్నారు. సమాచారం అందుకొన్న వారి బందుమిత్రులు ఘటనా స్థలం చేరుకొని గల్లంతైన తమ కుటుంబ సభ్యులకోసం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 

గల్లంతైన వారందరూ స్కార్పియో వాహనంలోనే చిక్కుకుపోయారా లేదా బయటపడి కాలువలో ఈదుకొని క్షేమంగా ఏదైనా ఒడ్డుకు చేరుకున్నారా? అనేది ఇంకా తెలియవలసి ఉంది. వారి కోసం ఇంకా గాలింపు కొనసాగుతోంది. క్రేన్ సహాయంతో స్కార్పియోను బయటకు తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. దానిని బయటకు తీస్తే పరిస్థితి అర్ధమవుతుంది.

Related Post