హైదరాబాద్లోని కాసు బ్రహ్మానందరెడ్డి (కేబీఆర్) జాతీయ పార్క్లో శనివారం ఉదయం మార్నింగ్ వాక్కు వచ్చినవారు వాకింగ్ ట్రాక్ను దాటుతూ వెళ్తున్న భారీ కొండచిలువను చూసి షాక్ అయ్యారు. సుమారు 10 అడుగుల పొడవున్న ఆ కొండచిలువ అప్పుడే ఏదో జంతువు లేదా పక్షిని మింగినట్లుంది. అందువల్ల అది చాలా నెమ్మదిగా కదులుతూ వాకింగ్ ట్రాక్ దాటి అవతలి వైపున్న పొదల్లోకి వెళ్ళిపోయింది.
మార్నింగ్ వాక్ కోసం వచ్చినవారు కొండచిలువను గమననించి దూరంగా ఉండిపోయారు. వారు తమ మొబైల్ ఫోన్లలో దానిని చిత్రీకరింఛి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో అవి వైరల్గా మారాయి.
నగరం నడిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్క్కి నిత్యం వందల మంది వాకింగ్ కోసం వస్తుంటారు. వారితో పాటు పార్కులో ఆడుకునేందుకు చిన్నారులు కూడా వస్తుంటారు. వృద్ధులు, మహిళలు, చిన్నారులు తిరిగే ఇటువంటి పార్కులో అంత భారీ కొండచిలువ తిరుగుతుండటం చాలా ఆందోళన కలిగించే విషయమే. కనుక పార్క్ నిర్వాహకులు తగు జాగ్రత్త చర్యలు తీసుకోవడం చాలా అవసరమని ఈ ఘటన నిరూపిస్తోంది.
(Video Courtesy: Telugu Scribe)