టిజీఎస్ ఆర్టీసీ కార్మికుల సమ్మె నేడు రెండో రోజున దిగ్బ్రాంతికరమైన విషాద ఘటన జరిగింది. వరంగల్ జిల్లా నర్సంపేట డిపోకు చెందిన డ్రైవర్ కోలా శంకర్ గౌడ్ ఒంటిపై పెట్రోల్ పోసి నిప్పంటించుకున్నాడు. వెంటనే సాటి కార్మికులు మంటలు ఆర్పి వరంగల్ ఎంజీఎం హాస్పిటల్కు తరలించారు. కానీ 80 శాతం పైగా కాలిన గాయాలతో అయన పరిస్థితి చాలా విషమంగా ఉంది. ఈ విషయం తెలుసుకున్న జిల్లా కలక్టర్ సత్య శారద, సీపీ సన్ప్రీత్ సింగ్ హుటాహుటిన అక్కడికి చేరుకొని శంకర్ గౌడ్ పరిస్తితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ డిపోకి చెందిన డ్రైవర్ వెంకన్న కూడా ఒంటిపై డీజిల్ పోసుకొని నిప్పు పెట్టుకోబోయాడు. కానీ సాటి కార్మికులు అడ్డుపడి ప్రాణాలు కాపాడారు.
భద్రాచలం డిపోకి చెందిన డ్రైవర్ లింగారెడ్డి కూడా అందరితో కలిసి సమ్మెలో పాల్గొన్నప్పుడు హటాత్తుగా గడ్డి మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. సాటి కార్మికులు వెంటనే ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించి సకాలంలో చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తమ సమస్యలు, డిమాండ్లు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నందుకు నిరసనగా ముగ్గురూ ఆత్మహత్యకు ప్రయత్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే ఆవేశంతో ఉన్న కార్మికులు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. సమ్మెలో చనిపోయే ప్రతీ కార్మికుడితో కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలలో వ్యతిరేకత పెరిగే అవకాశం ఉంటుంది.