నేడు క్రిస్మస్ పండుగ నుంచి నూతన సంవత్సర వేడుకలు ప్రారంభం అవుతాయి. ముఖ్యంగా హైదరాబాద్ వంటి మెట్రో సిటీలలో మరింత అట్టహాసంగా జరుగుతుంటాయి. అప్పుడే క్లబ్బులు, పబ్బులు హౌస్ ఫుల్ అయిపోతున్నాయి. కనుక మద్యం సేవించి వాహనాలు నడిపేవారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది.
హైదరాబాద్ కమీషనరేట్ పరిధిలో నేటి నుంచే పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు ప్రారంభించారు. సాయంత్రంలోగానే 304 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారు. పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.
నేటి నుంచి డిసెంబర్ 31 అర్దరాత్రి వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ తనికీలు నిర్వహిస్తామని పోలీసులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడుపడం మోటారు వాహన చట్ట విరుద్దం. ఒకవేళ మద్యం మత్తులో ప్రమాదం జరిగితే చర్యలు ఇంకా తీవ్రంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల కోసం నగరంలోకి పెద్ద ఎత్తున గంజాయి, మాదక ద్రవ్యాలు సరఫరా అవుతుంటాయి. కనుక ఈగల్ టీమ్ కూడా నిఘా పెట్టి నేడు మేడిపల్లిలో నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి నుంచి సుమారు 3 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు.