ఈ రోజు తెల్లవారుజామున 3.30 గంటలకు కర్నూలు శివారులో జరిగిన ఘోర అగ్నిప్రమాదంఓ ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం అయ్యారు.
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న ఆ బస్సులో నెల్లూరు జిల్లాలోని గొల్లవారిపాల్లి గ్రామానికి చెందిన గొల్ల రమేష్ (35), ఆయన భార్య అనూష (30),కుమారుడు మనీష్ (12) కుమార్తె మన్విత (10) మృతి చెందారు.
పోలీసులు వారి మృతదేహాలను వెలికి తీసి గుర్తించి బంధువులకు సమాచారం ఇచ్చారు. వారి కుటుంబ సభ్యులు సమీప బంధువులు అక్కడకు చేరుకొని కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
బస్సుని వెనుక నుంచి బైక్ డీకొన్నప్పుడు అది చక్రాల మధ్యకు చిక్కుకుపోవడంతో దానిని కొంత దూరం బస్సు ఈడ్చుకు పోయింది. అప్పుడే నిప్పు రవ్వలు ఎగసి పెట్రోల్ ట్యాంకుకు నిప్పు అంటుకొని మంటలు బస్సు అంతా వ్యాపించాయి.
ఆ సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండటం వలన మేల్కొనేలోగానే మంటలలో చిక్కుకొని సజీవ దహనం అయిపోయారు. మొత్తం 21మంది ఈ ప్రమాదంలో చనిపోగా ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికి తీసి గుర్తించినట్లు కర్నూలు జిల్లా కలెక్టర్ సిరి తెలిపారు. వారిలో గొల్ల రమేష్ కుటుంబం కూడా ఉంది.
సూరారం వద్ద ఈ బస్సు ఎక్కినా గుణసాయి, జేఎన్టీయు వద్ద ఎక్కినా ముగ్గురిలో ఒకరు కిటికీలో నుంచి దూకి ప్రాణాలు కాపాడుకోగలిగారు. కానీ మిగిలిన ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు.