కర్రెగుట్టలో ఎదురు కాల్పులు.. ఈసారి మరో 22 మంది!

May 08, 2025
img

దేశంలో మావోయిస్టులను సమూలంగా నిర్మూలిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. అందుకోసం దేశంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలలో భద్రతా దళాల కూంబింగ్ ఆపరేషన్ పెద్ద ఎత్తున కొనసాగుతోంది. ఇటీవలే కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్‌, తెలంగాణలో ములుగు, భద్రాద్రి కొత్తగూడెం మద్య విస్తరించి ఉన్న కర్రెగుట్టల వద్ద మావోయిస్టులకు, భద్రతా దళాలకు మద్య ఎదురుకాల్పులు జరుగగా పలువురు మావోయిస్టులు మరణించారు. 

మళ్ళీ బుధవారం తెల్లవారుజామున అక్కడే మరోసారి మావోయిస్టులకు, భద్రతా దళాలకు మద్య ఎదురుకాల్పులు జరిగాయి. సుమారు రెండున్నర గంటలకుపైగా సాగిన ఈ యుద్ధంలో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. 

దట్టమైన అడవులు, భూగర్భ సొరంగాలలో దాక్కున్న మావోయిస్టులను గుర్తించేందుకు భద్రతా దళాలు హెలికాఫ్టర్లు, డ్రోన్ కెమెరాలను ఉపయోగించి కనిపెట్టి వారిని చుట్టుముట్టారు. ఆపరేషన్ ముగిసిన తర్వాత 18 మంది మావోయిస్టుల మృతదేహాలను వెలికితీశారు. మిగిలినవారి కోసం భద్రతా దళాలు గాలిస్తున్నాయి. మావోయిస్టుల డంప్ నుంచి భద్రతా దళాలు భారీగా ఆయుధాలు, ప్రేలుడు సామాను స్వాధీనం చేసుకున్నారు. 

తొలిసారిగా వారి డంప్‌లో 235 తూటాలు ఏకధాటిగా ఫైర్ చేయగల ఆటోమేటిక్ హెవీ మెషిన్ గన్ కూడా కనుగొన్నారు. 

సీఆర్పీఎఫ్ డీజీ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్ (ఢిల్లీ), ఛత్తీస్‌ఘడ్‌ నక్సల్స్ ఆపరేషన్ ఏడీజీ వివేకానంద సిన్హా, బస్తర్ ఐజీ సుందర రాజ్ పర్యవేక్షించారు. మావోయిస్టులు ఆయుధాలు వదిలి పోలీసులకు లొంగిపోయే వరకు ఈ ఆపరేషన్ కొనసాగుతుందని ఛత్తీస్‌ఘడ్‌ సిఎం విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి విజయశర్మ స్పష్టం చేశారు. 


Related Post