మంగళవారం జమ్ము కశ్మీర్లో పహల్గామ్ వద్ద పర్యాటకులపై ఉగ్రవాదుల దాడి చేసి 28 మందిని చంపేయడంతో, విహారయాత్రకని జమ్ము కశ్మీర్ వెళ్ళిన పర్యాటకులు భయంతో తమ పర్యటన రద్దు చేసుకొని తిరుగు ప్రయాణం అవుతున్నారు.
నిన్న ఉగ్రదాడి జరిగిన తర్వాత ఆరు గంటల్లోనే 3300 మంది పర్యాటకులు తమ పర్యటన రద్దు చేసుకొని తిరుగు ప్రయాణం అయ్యారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
తిరుగు ప్రయాణం అవుతున్న పర్యాటకుల కొరకు శ్రీనగర్ విమానాశ్రయం నుంచి 20 ప్రత్యేక విమానాలు ఏర్పాటు చేశామని చెప్పారు. విమానయాన సంస్థలు కూడా క్యాన్సిలేషన్ ఫీజులు, రీ షెడ్యూల్ ఫీజులు రద్దు చేసి ప్రయాణికులను గమ్య స్థానాలకు తరలిస్తున్నాయని చెప్పారు. ఎటువంటి అదనపు ఛార్జీలు వసూలు చేయరాదని విమానయాన సంస్థలను ఆదేశించమని మంత్రి రామ్మోహన్ నాయుడు చెప్పారు.
జమ్ము కశ్మీర్లో వేసవి అతి ముఖ్యమైన పర్యాటక సీజన్. కానీ వేసవి సీజన్ ప్రారంభమై పర్యాటకులు రావడం మొదలవగానే ఈ విషాద ఘటన జరిగింది. దీంతో పర్యాటకులు తిరిగి వెళ్ళిపోతున్నారు. ఇంకా రావలసిన పర్యాటకులు తమ పర్యటనని రద్దు చేసుకుంటున్నారు.
ఈ వేసవి సీజన్ ప్రారంభంలోనే ఈవిధంగా జరగడంతో పర్యాటకుల నుంచి వచ్చే ఆదాయం కోల్పోయామని జమ్ము కశ్మీర్ స్థానికులు చెపుతున్నారు. నిన్న జరిగిన ఉగ్రదాడిలో పర్యాటకులు చనిపోగా, వారిపైనే ఆధారపడిన వేలాది కుటుంబాలు రోడ్డున పడతాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు.