ప్రఖ్యాత చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రధాన అర్చకుడుగా సేవలందిస్తున్న సీఎస్ రంగరాజన్పై కొందరు వ్యక్తలు శుక్రవారం దాడి చేశారు. ఆయన ఆలయం సమీపంలో తన నివాసంలో ఉన్నప్పుడు సుమారు 20 మంది వ్యక్తులు వచ్చి రామరాజ్యం స్థాపనకు మద్దతు ఇవ్వాలని కోరారు.
కానీ తాను అటువంటి కార్యక్రమాల గురించి మాట్లాడకూడదని చెప్పారు. దాంతో వారు ఆయనని నోటికి వచ్చిన్నట్లు తిడుతూ దాడి చేసి వెళ్ళిపోయారు. తర్వాత ఆయన మొయినాబాద్ పోలీస్ స్టేషన్కు వెళ్ళి పిర్యాదు చేశారు.
పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయనపై దాడి చేసినవారి కోసం గాలిస్తున్నారు. ఈ విషయం తెలుసుకొని ఆయనపై దాడి చేసినవారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. కానీ పోలీసులు వారిలో కొవ్వూరి వీరరాఘవరెడ్డి అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. అతను చెప్పిన వివరాల ఆధారంగా మిగిలినవారి కోసం గాలిస్తున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా దేవాలయ భూములు కబ్జా అవుతున్నా, నిత్యం వేలాది ఆవులను మాంసం కోసం చంపుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని, కనుక వాటి రక్షణ కోసం తొలి విడతలో నెలకు రూ.20 వేలు జీతం, ఉచిత భోజనం, వసతి సౌకర్యాలతో 5,000 మంది సైనికులతో రామరాజ్యం స్థాపిస్తున్నామని సోషల్ మీడియాలో ప్రకటించారు. తమ సంస్థకు మద్దతు ఈయాలని కోరగా రంగరాజన్ నిరాకరించడంతో వారు ఆయనపై దాడి చేశారు.