హైదరాబాద్లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణలో పార్టీల నేతలు ఘాటుగా స్పందిస్తూనే ఉన్నారు. ఆ వేడి ఇంకా చల్లారక మునుపే నటుడు ప్రకాష్ రాజ్ కూడా జస్ట్ ఆస్కింగ్ అంటూ పవన్ కళ్యాణ్పై ఓ రాయి వేశారు.
“మీరొస్తానంటే మేమొద్దంటామా? రండి దొర... కానీ వచ్చే ముందు ఉత్తుత్తినే వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా? లేదా సింగిల్గా వస్తున్నా... అది చెప్పి రండి..” జస్ట్ ఆస్కింగ్! అని ట్వీట్ చేశారు.
దీనిపై ముందుగా జనసేన స్పందిస్తుందనుకుంటే పవన్ కళ్యాణ్ వీరభక్తుడు, నిర్మాత బండ్ల గణేష్ స్పందించడం విశేషం.
“నీకెందుకురా ప్రతీ దాంట్లో వేలు పెట్టడం? అసలు నువ్వెవడివి? తమిళోడివా, తెలుగోడివా, కన్నాడోడివా? నీ ఊరు ఏది, నీ కథ ఏంటి? ప్రతీ ఊర్లో, ప్రతీ ఇష్యూలో దూరి జడ్జిమెంట్ ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రదానివా? ఎక్కడ చూసినా నువ్వే. ఏ విషయం వచ్చినా నువ్వే. నీ బతుక్కి పని లేకపోతే చూసుకో. కానీ అందరి విషయాలలో దూరిహీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చెయ్,” అని ఘాటుగా సమాధానం ఇచ్చారు. అయినా బండ్ల ఆవేశం ఇంకా తగ్గలేదు. కనుక వెంటనే మరో పెద్ద ట్వీట్ వేసి ప్రకాష్ రాజ్ని ఉతికి ఆరేశారు.